Nov 15,2022 00:02

నృత్యం చేస్తున్న శ్రీ విజ్ఞాన్‌ స్కూల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-మాడుగుల:మండలంలోని ఎం.కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్‌ కోన అన్నపూర్ణ దేవి ఆర్థిక సహాయంతో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతి ప్రధానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గొల్లవిల్లి సంజీవరావు, వైస్‌ సర్పంచ్‌ గంజి రాజేష్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొల్లపల్లి రాజేష్‌, నీటి సంఘం అధ్యక్షులు కలిమి గోసమ్మ, పాల సంఘం అధ్యక్షులు గొల్లవిల్లి సత్యారావు, వైసిపి గ్రామ శాఖ అధ్యక్షులు పడాల అప్పలనాయుడు, ఎలిమెంటరీ స్కూల్‌ కమిటీ చైర్మన్‌ జమ్మల భీమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల:మండలంలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలు అందంగా ముస్తాబై పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల కేంద్రంలో బాలికల పాఠశాల, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
గొలుగొండ:మండలంలోని సిహెచ్‌.నాగాపురం. ఎంపీపీ స్కూల్‌లో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రఘురాం, స్కూల్‌ హెచ్‌ఎం చిన్నారావు మాస్టర్‌, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్‌ పాల్గొన్నారు. చోద్యం, కొత్త మల్లంపేట, ఏఎల్‌ పురం తదితర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
నర్సీపట్నం టౌన్‌:పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగిన రమణ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పిసిసి సభ్యులు మీసాల సుబ్బన్న నెహ్రు ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యయతలు స్వీకరించారన్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. బాలబాలికల పట్ల అమిత ప్రేమ చూపేవారని, దీంతో బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దా, కర్రి తాతబ్బాయి, జనపరెడ్డి సూరిబాబు, చుక్కల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కనోస ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు
పాయకరావుపేట:పట్టణంలోని కనోస ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ సోఫియా మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో మంచిగా స్థిరపడాలని, ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని సంపాదించాలన్నారు. మానసిక ఒత్తిడిని గురికాకుండా విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్‌ మేరీ, సిస్టర్‌ అలెక్స, పిటి శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా బాలల దినోత్సవం
భారత దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలు, బాలల దినోత్సవ కార్యక్రమాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
అనకాపల్లి:
స్థానిక జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాలలో మదర్‌ థెరిసా వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ సీఈవో కర్రి కిషోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ఎంపీ డాక్టర్‌ సత్యవతి విష్ణుమూర్తి పాల్గొని, వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, కార్పొరేటర్‌ జాజుల ప్రసన్న రమేష్‌ పాల్గొన్నారు. స్థానిక ఏఎంఏఎల్‌ కళాశాలలో నెహ్రూ విగ్రహానికి ఆస్క్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి రాజేంద్రప్రసాద్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ హరిబాబు, సామ్రాజ్యం, సౌజన్య మోహిని పాల్గొన్నారు. జీవీఎంసీ వుడ్‌పేట ప్రాథమిక పాఠశాలలో వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, అనకాపల్లి డిసిసిబి బ్రాంచ్‌ మేనేజర్‌ స్వాతి, సత్యనారాయణపురం మండల ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం గండేపల్లి తులసి లక్ష్మి, లక్ష్మీదేవి పేట లక్ష్మీ గ్రంథాలయంలో విశ్రాంత ఉపాధ్యాయులు కొణతాల సన్యాసిరావు పాల్గొన్నారు.
కశింకోట : స్థానిక సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌లో నెహ్రూ చిత్ర పటానికి కశింకోట ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్‌ బత్తుల నోబొల్‌ కుమార్‌, కరస్పాండెంట్‌ బత్తుల అనురాధ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవంలో ఎంఇఒ ఎస్‌.అప్పలరాజు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం సిహెచ్‌.చిన్నమ్మాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాసరచన, ఉపన్యాస, కోలాటం, డ్రాయింగ్‌ పోటీలలో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నెహ్రూ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించిన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు పెద్దాడ వెంకటరమణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
అచ్యుతాపురం : బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక భవాని విద్యానికేతన్‌ పాఠశాలలో బాలికలు చేసిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్‌ కె.సంతోష్‌, డైరెక్టర్‌ శ్రీలత పాల్గొన్నారు. తిమ్మరాజుపేట పాఠశాలలో ఉపాధ్యాయులు మారిశెట్టి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు.
యలమంచిలి : చిల్డ్రన్స్‌ డే సందర్భగా బాలల హక్కులను పరిరక్షించాలని కోరుతూ బాలల బాధ్యత - అందరి బాధ్యత అన్న నినాదంతో ఛైల్డ్‌ లైన్‌ సీడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి కనకమహాలక్ష్మి ఆధ్వర్యాన పట్టణంలో సోమవారం 300 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికల హైస్కూలు నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌ రోడ్డు గుండా కొత్తపేట వరకూ కొనసాగింది. బాల్య వివాహాలు ఆపుదామంటూ నినదించారు. ఈ ర్యాలీకి మహిళా పోలీసులు మద్దతు ప్రకటించారు. స్థానిక మహిళా పోలీస్‌ కుమారి మాట్లాడుతూ ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా విద్యార్థులు ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (1098) సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు లీల, లత, భవాని, సునీత, వీరలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవిజ్ఞాన్‌ స్కూల్‌లో ఘనంగా వేడుకలు
చోడవరం : స్థానిక శ్రీవిజ్ఞాన్‌ స్కూల్లో సోమవారం బాలల దినోత్సవాన్ని డైరెక్టర్‌ ఎంఎంకె.రాజు, ప్రిన్సిపాల్‌ ఎం.జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలు ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.