ప్రజాశక్తి- తగరపువలస : స్థానిక అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో అవంతి విద్యాసంస్థల వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు సానుకూల దక్పథంతో ఆలోచనలు చేయాలన్నారు. నైతిక విలువలు ఆధారంగానే విద్యార్థి నడత, నడకను అంచనా వేయొచ్చని తెలిపారు. సమయపాలన, క్రమశిక్షణ ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఎంచుకున్న రంగంలో పట్టు సాధించడం ద్వారానే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. భువనేశ్వర్ ఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ రత్నం వరద రాజ్కుమార్ మాట్లాడుతూ, సాఫ్ట్ వేర్ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. నైపుణ్యం పెంచుకోవడం ద్వారా వాటిని అందిపుచ్చుకో వచ్చని తెలిపారు. విజయనగరం జెఎన్టియు జివి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆ రంగంలో ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలని సూచించారు. నమరు సాఫ్ట్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ కె.శ్రీధర్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాక, అందుకు అనుగుణంగా, అనువైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. అవంతి విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో , రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.










