ప్రజాశక్తి-అరకులోయ:మండల కేంద్రంలోని వాలీబాల్ గ్రౌండ్లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షమ్మ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్) డాక్టర్ జోయల్ జస్వంత్ గుమ్మడి మాట్లాడుతూ, క్రీస్తు జననం కోసం వివరించారు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గమని ఆయన అన్నారు. క్రీస్తును కలిగిన వాడు మంచి మార్గంలో నడుస్తారని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ మాత్రమేనని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు మాట్లాడుతూ, మన్య ప్రాంతంలో క్రైస్తవ్యం అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతమైన సామాజిక చైతన్యం ప్రజల్లో వచ్చిందన్నారు. అటువంటి సామాజిక విప్లవం రావడంతోనే ఆలోచన విధానాలు మారిందన్నారు. క్రైస్తవ్యం క్రమశిక్షణ సత్ప్రవర్తన అలవర్చు కోవడానికి దోహదపడుతుందన్నారు.
అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ మాట్లాడుతూ, క్రీస్తు జననమే ఒక అద్భుతం, ఆనందమని ఆయన వివరించారు. క్రైస్తవులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయక మన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి ఎస్.బాబురావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు వి.ప్రభుదాస్, కే ఎలీషా, రెవ. కె.ఎస్ బాబురావు, ఎస్.శ్యాంసన్, బిషప్. ఎం.వి. కే.విజరు డానియల్ మోడీ, అరకులోయ జడ్పిటిసి శెట్టి రోష్ణి, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, టిడిపి మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శాంతకుమారి, ఎంపిటిసి సభ్యులు దురియా ఆనంద్ కుమార్, వైసీపీ నాయకుడు కమిడి అశోక్, అరకులోయ సీఐ జిడి బాబు, బిషప్. జీ. ప్రసాద్ రావు, వి.ప్రసాద్ పాల్, కె.జాన్ ప్రకాష్, బిఇ సంజీవ్ కుమార్, కే.శామ్యూల్, పి. షద్రక్ పాల్గొన్నారు.










