
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరు కలెక్టరేట్ రోడ్డులో ఏర్పాటు చేసిన వికాస్ ఆస్పత్రిని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనీ బుధవారం ప్రారంభించారు. పలు విభాగాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, డిప్యూటీ మేయర్ సజీల, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైసిపి అద్దంకి నాయకులు బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, టిడిపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బి.రామాంజనేయులు, కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మచిలీపట్నం పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మేకతోటి దయాసాగర్, వికాస్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ గల్లా రామచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజనీ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో 100 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించడం ముదావాహమని, ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను మంత్రి రజనీ అభినందించారు. ప్రజలు వికాస్ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందివ్వాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలను పేదలకు అందించాలన్నారు. హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ గల్లా రామచంద్రరావు మాట్లాడుతూ గుంటూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతికి పరిజ్ఞానం, అడ్వాన్సు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తామని చెప్పారు. అసమాన ప్రతిభ కలిగిన వైద్యులు తమ అనుభవంతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వికాస్ హస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ సుధాకర్ కనుమూరి, డాక్టర్ సురేంద్ర నాగులపాటి, డాక్టర్ కనకదుర్గ తదితరులు మాట్లాడుతూ అపార నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్ల బృందం కేవలం మందులతోనే కాకుండా మనస్సుపెట్టి వైద్యం అందిస్తుందని చెప్పారు. రోగులకు ఆత్మీయతతో చికిత్సలు జరుగుతాయన్నారు.