Apr 15,2023 00:41

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున, ఇతర ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బిఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక లాడ్జి సెంటరు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఆధునీకీకరించిన ఐలాండ్‌ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీ క్రిస్టీనా, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తీ చేకూరి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ శామ్యూల్‌ జోనథన్‌, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, మాజీ మంత్రి డొక్కామాణిక్యవర ప్రసాద్‌, డిప్యూటీ మేయరు వనమా బాల వజ్రబాబు, సజీలా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ బత్తుల దేవానంద్‌ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో పలువురు టిడిపి నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేశారు.
జెడ్పీలో అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ..
అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని జెడ్పీ ప్రాంగణంలోని, పంచాయితీరాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని జెడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, జెడ్పీ సిఇఒ మోహనరావు, వైస్‌ చైర్మన్‌ బి.అనురాధ, జెడ్పీటిసిలు రమేష్‌, వెంకటలక్ష్మి, గుల్జార్‌బేగం, పంచాయిరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి.మురళీకృష్ణనాయుడు, కె.సంగీతరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు.
పిడుగురాళ్లలో విగ్రహావిష్కరణ
పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనుషుల మధ్య అసమానతలు తొలగి, ప్రతి ఒక్కరూ సమానమని భావన కలిగి ఉండాలన్నారు. ఎంపీ మాట్లాడుతూ ఎన్నో అవమానాలు, అసమానతలు ఎదర్కొన్న అంబేద్కర్‌ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, ఆ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లపై కొంత మంది అనవసరంగా మాట్లాడుతున్నారని, నేటికి కూడా చాలా మందికి తక్కువ కులం అనే భావనలో ఉండిపోతున్నారని, ఈ పరిస్థితిలో మార్పు కోసం రిజర్వేషన్లు కొనసాగాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ కె.వెంకట సుబ్బారావు, వైసిపి నాయకులు సిహెచ్‌.రామారావు, ఎం.సుధీర్‌, జి.పవన్‌రెడ్డి, డాక్టర్‌ యు.నాగమల్లిఖార్జునరావు పాల్గొన్నారు.