Jul 21,2023 23:36

చెక్కును అందచేస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-గుంటూరు : చేనేత కార్మికులు తమ సొంత మగ్గాలను ఆధునీకరణ చేయటానికి మెరుగైన ఉత్పత్తి సాధించేందుకు, మరమగ్గాల పోటీ నుండి తట్టుకొని, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్‌ నేతన్న నేస్తం పధకం ద్వారా లబ్ది చేకూరుస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నుండి ముఖ్యమంత్రి ఐదో విడత నేతన్న నేస్తం నిధులు బటన్‌ నొక్కి జమచేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే కిలారు రోశయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఐదో విడతలో 769 మంది లబ్దిదారులకు రూ.1.84 కోట్లు అందించినట్లు చెప్పారు. ఐదు విడతల్లో రూ.7.79 ఆర్థిక లబ్ది చేకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, జీడీసీసిబి చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఎన్‌ఆర్డీఇసి డైరెక్టర్‌ కొత్త చినప్పరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బత్తుల దేవానంద్‌, జిఎంసి డిప్యూటీ మేయర్‌ బాలవజ్ర బాబు పాల్గొని లబ్ధిదారులకు మెగా చెక్కును అందచేశారు. జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారులు శ్రీధర్‌బాబు, రాఘవరావు పాల్గొన్నారు.