గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
ప్రజాశక్తి - సి.బెళగల్
సి.బెళగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు (51) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు కర్నూల్ నగరంలో నివాసముంటున్నారు. ప్రతి రోజూ కర్నూలు నుండి బెళగల్కు విధులకు హాజరయ్యేవారు. రోజుమాదిరిగానే శనివారం ఉదయం కర్నూలులో గుండ్రేవుల బస్సు ఎక్కారు. సీటులో కూర్చున్న ఆయన నిద్రలోకి జారుకున్నారు. బస్సు గుండ్రేవుల వెళ్లి మళ్లీ కర్నూలుకు బయల్దేరడానికి సిద్ధమవుతుండగా సీట్లో అలాగే ఉన్న హెడ్ కానిస్టేబుల్ దగ్గరికి కండెక్టర్, డ్రైవర్ వెళ్లి ఆయనను పిలిచారు. అయనను తట్టి లేపేందుకు యత్నించగా ఏమాత్రం చలనం లేకపోవడంతో వెంటనే బెళగల్ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయనను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య కాంచన, ఒక కూతురు నవ్యశ్రీ ఉన్నారు. విషయం తెలిసి బెళగల్, కోడుమూరు, గూడూరు ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సహచర సిబ్బంది దిగ్బ్రాంతి చెందారు.
మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు










