గృహ నిర్మాణ పనులు వేగవంతం
ప్రజాశక్తి - మిడుతూరు
మిడుతూరు మండలంలో జగనన్న గృహాల నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేసుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచించారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా మండలంలోని సుంకేసుల గ్రామంలో జగనన్న కాలనీని నియోజకవర్గ ప్రత్యేక అధికారి రఘురాం, ఎంపిడిఒ జిఎస్ఎన్ రెడ్డి, తహసీల్దార్ ఎస్ ప్రకాష్ బాబు, ఇంచార్జి హౌసింగ్ ఏఈ జె.రమేష్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడుతూ మూడు రోజుల్లో బిల్స్ పడుతున్నాయని, త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీలలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు జులై నెలలోగా ఇల్లు పూర్తి చేసుకుని విద్యుత్ మీటర్లు ఉచితంగా పొందాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘురాం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శాంతరాజు, వాలంటీర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.










