
పార్వతీపురం:గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమన్నారు. ఈ చట్టం కింద గర్భం ధరించడానికి ముందుగానీ, తర్వాత గానీ లింగ ఎంపికను నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఏ లేబొరేటరీగానీ, స్కానింగ్ కేంద్రంగానీ గర్భస్థ పిండం లింగాన్ని తెలిపే ఉద్దేశ్యంతో చేయరాదని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడశిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటి సమాచారం తెలిస్తే 102, 104 టోల్ ఫ్రీ నంబరుకు లేదా ఆన్లైన్ గ్రీవియన్స్ (జూషజూఅస్.aజూ.స్త్రశీఙ.ఱఅ) ద్వారా తెలియజేయవచ్చని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు మాట్లాడుతూ జిల్లాలో 35 స్కానింగ్ కేంద్రాలను మూడు నెలలకొకసారి తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో లింగ నిష్పత్తిలో తగ్గుదల ఉందన్నారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి ఎ.రమేష్, ఎఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్, డిహెచ్ఎస్ఒ డాక్టర్ బి.వాగ్దేవి, ఆర్బిఎస్కె ప్రాజెక్టు అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు, ప్రోగ్రాం అధికారులు ఎం.వినోద్, టి.జగన్మోహన్రావు, సభ్యులు జికె దుర్గ, సిహెచ్ కమలకుమారి, సంధ్య, డి.పారినాయుడు, వై,వివేక్, లోచర్ల రమేష్ పాల్గొన్నారు.
అక్రమ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాలి
అక్రమ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్, ప్రోహిబిషన్ సమన్వయ కమిటీ సమా వేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం విక్రయాలపై నిఘా అధికం చేయాల న్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఇతర మార్గాల ద్వారా జిల్లాలో నాటు సారా, మద్యం ప్రవేశించే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల పట్ల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని అన్నారు. బెల్టు షాపులు, ఇతర విక్రయాలపై తనిఖీలు జరగాలన్నారు. సమావేశంలో జెసి ఆర్.గోవిందరావు, ఎఎస్పి దిలీప్ కిరణ్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.