
ప్రజాశక్తి - జీలుగుమిల్లి : గర్భిణీ స్త్రీలకు, రక్త హీనత గల పిల్లలకు పోషకాహారం అందించాలని అసిస్టెంట్ కలెక్టర్ టి.శ్రీపూజా తెలిపారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అక్షజా న్యూట్రిషన్ ప్రొడక్ట్పై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, రక్త హీనత గల పిల్లలకు ప్రోటీన్ మిక్స్ న్యూట్రిషన్ ఫుడ్ అందించడం ద్వారా ఆరోగ్యంగా బలంగా ఉంటారని ఆమె అన్నారు. అదేవిధంగా రక్త హీనతతో బాధపడుతున్న, బరువు తక్కువ ఉన్న 3 సంవత్సారాల నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు 5 నెలల పాటు ఈ న్యూట్రిషన్ ఫుడ్ను అందించడం ద్వారా ఎనీమియా బారి నుంచి కాపాడవచ్చని సూచించారు. స్త్రీ శిశ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెయింట్ థెరిస్సా కళాశాల వారు ఈ ప్రొడక్ట్ను సంయుక్తంగా నిర్వహిస్తున్నారని, బలహీనంగా ఉన్న వారికి ఈ ఫుడ్ అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె.విజయలక్ష్మి, సెయింట్ థెరిస్సా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ, ఎంపిడిఒ కృష్ణప్రసాద్, పిహెచ్సి వైద్యాధికారి గాయత్రి, సిడిపిఒ తులసి, సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ, మండలం వ్యాప్తంగా ఉన్న హెల్త్, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.