సీతానగరం: కనీసం రోడ్డు గోతులను కూడా పూడ్చలేని చేతకాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జి బోనెల విజరు చంద్ర ధ్వజమెత్తారు. స్థానిక పెద్దబోగిలి పంచాయతీ మార్కెట్ లో మెయిన్ రోడ్పై గోతులు చెరువు తలపించేలా నీరు ఉన్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అన్ని రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం కనీసం రోడ్లును కూడా వేయలేని స్థితిలో ఉందని, అరాచకం పెరిగిందని, ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపడం ఖాయమని హెచ్చరించారు.
నియోజకవర్గ కొత్త ఇన్చార్జికు ఘన స్వాగతం
టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బోనెల విజయచంద్రకు మండల టిడిపి నాయకులు ఎస్.హరిగోపాలరావు, ఆర్.వేణుగోపాల్ నాయుడు. బి.శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. సలహరి గోపాలరావు ఇంటి వద్ద సన్మానిస్తూ పార్టీ ఇచ్చిన బాధ్యతలు సక్రంగా నిర్వహిస్తానని, రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం ఆయన్ని సన్మానించారు. కార్యక్రమంలో పెదబోగిలి సర్పంచ్ జొన్నల తేరేజమ్మ, మాజీ ఎంపిటిసి సభ్యులు సంభాన శ్రీనివాసరావు, నాయకులు దామినేని భాను ప్రసాద్, ఎం.శంకరరావు, సతీష్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
గుంతల రోడ్డులో ప్రయాణం నరకం
కురుపాం: గుంతల మయమైన రోడ్డులతో గిరిజన ప్రజల ప్రయాణం నరకంలా ఉందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలోని గోటివాడ గ్రామంనకు వెళ్లే గుంతల మైన రోడ్డును గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఈ ఆధునిక ప్రపంచంలో కూడా మట్టిరోడ్డుపై రాకపోకలు సాగించడం చాలా బాధాకరమని వర్షం పడితే నడవడానికి కూడా కష్టంగా ఉంటుదని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటిది అత్యవసర పరిస్థితుల్లో రోగిని మూడు కిలోమీటర్లు మోసుకొని మెయిన్ రోడ్డుకు తీసుకువచ్చి 108 వాహనానికి ఎక్కించే సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిటి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పోలూరు శ్రీను, గ్రామస్తులు నిమ్మక అప్పారావు, ప్రసాద్, కైలాసు, రాజు, సంతు, బాల, ఆదమ్మ పాల్గొన్నారు.
భామిని : మండలంలోని సింగిడి సమీపంలోని ప్రధాన రహదారి బత్తిలి -అలికాం రోడ్డుపై నీటితో నిండిన గుంటలులో వరి నాట్లు నాటుతూ, రోడ్డు దుస్థితి పై పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ నిమ్మక. జయకష్ణ నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉండి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యి, ప్రజలు రోడ్డు ప్రమాదాలు గురి అవుతుంటే స్థానిక ఎమ్మెల్యేకు పట్టదానని ప్రశ్నించారు. అనంతరం భామిని ఎగువ భాగం లో ఇతంగూడ సమీపంలో అర్ధాంతరంగా నిలిచిన కొండ లోయ గెడ్డ రిజర్వుయర్ , వడ్డీంగి వద్ద గజపతి సాగరం ను పరిశీలించారు. కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి మెడిబోయన జగదీశ్వరరావు, అంపిలి కేశవ, బిడ్డికి ప్రసాద్, లోపింటి రాజేష్, సాకేటి రామారావు, కోరాడ రాజేష్, భూపతి ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.










