ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్ద మహిళా కళాశాల విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా గోద్రెజ్ ఆగ్రోవేట్, ఆక్వాసీడ్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఆక్వాకల్చర్లో నైపుణ్యాన్ని అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తమ కళాశాల ఉపాధ్యాయులు గోద్రేజ్ అగ్రోవెట్ ఉద్యోగులకు కావాల్సిన ఆక్వాకల్చర్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. గోద్రెజ్ సంస్థ హెచ్.ఆర్. గిరీష్ మాట్లాడుతూ ఆక్వాకల్చర్లో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని ఆక్వాకల్చర్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి గిరీష్తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.










