ప్రజాశక్తి-నెల్లూరు :నగరంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠా గుట్టును నవాబుపేట పోలీసులు రట్టు చేశారు. శనివారం నవాబుపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర డిఎస్పి శ్రీనివాసులరెడ్డి ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విలాసాలకు, అల్పసంపాదనకు అలవాటు పడి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పి శ్రీనివాసులరెడ్డి సారధ్యంలో జాతీయ రహదారి సమీపంలోని ప్రశాంతి నగర్ సెంటర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో 9 కేజీల గంజాయి, అనంతపురం జిల్లా, ముదిగుబ్బ మండలం, కొండగట్టు పల్లి గ్రామానికి చెందిన పటాన్ గుత్తి షేక్ షావలి, యెల్లటూరు సబీర, నగరంలోని మూలాపేట , ప్రియాంక స్కూల్ సమీపంలో ఉన్న షేక్ ఫైరోజ్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో మరికొంత సమాచారం తెలిసిందని, గంజాయి అక్రమంగా రవాణా, విక్రయం చేస్తున్న మరికొంత మంది పేర్లును తెలుసుకున్నామని, వారి త్వరలో పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. ఈ తనిఖీలల్లో ప్రతిభను కనపరిచిన నవాబుపేట సిఐ ఎం.బాబి,ఎస్ఐలు బి.శివప్రకాష్,ఎస్.ఎ.రహిమాన్, సిబ్బంది జి.వెంకటేశ్వర్లు, ఆర్.వి.రత్నం, ఎస్.సురేంద్రబాబు, బి.మోహన్బాబు, ఎం.వేణు, బి.మస్తానయ్య, డి.శ్రీనిజలను అభినందించారు.










