- 8 కేజీల గంజాయి, రెండు బైక్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు
ప్రజాశక్తి-కొయ్యూరు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కొయ్యూరు పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొయ్యూరు ఎస్ఐ రాజారావు కథనం ప్రకారం... గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కొయ్యురు సిఐ స్వామి నాయుడు ఆధ్వర్యంలో కొయ్యురు, మంప ఎస్ఐలు సిబ్బంది మండలంలోని చీడిపాలెం గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి మార్గం నుండి కాకరపాడు మీదగా ఏలేశ్వరం వైపు రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తూ, చీడిపాలెం గ్రామ శివారులో పోలీసులను బైక్లను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు లగేజ్ బ్యాగ్ల్లో 8 కేజీల గంజాయిని గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 8 కేజీల గంజాయిని, వారి ప్రయాణిస్తున్న పల్సర్ బైకు, హోండా లివో బైక్ను, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రాజారావు నలుగురు నిందితులు కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలానికి చెందిన అన్నంనేడి రవిచంద్ర, మట్టా ఆకాష్ రెడ్డి, ములగాటి నాగేంద్ర, దొమ్మేటి అభినవ్పై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










