
ప్రజాశక్తి- గాజువాక: గంగవరం పోర్టు కాలుష్యం నివారించాలని, ప్రజలు ఆరోగ్యాలు కాపాడాలని కోరుతూ జివిఎంసి 76వ వార్డు పరిధి స్వతంత్రనగర్లోని వై జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యాన సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, గంగవరం పోర్టు కాలుష్యం వల్ల సుమారు 10 గ్రామాలు ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలను గంగవరం పోర్టు యాజమాన్యం పాటించకుండా కాలుష్యాన్ని ప్రజలపై వదులుతూ అనారోగ్యానికి గురిచేస్తోందని తెలిపారు. పోర్టు లాభాలు అదానీకి, రోగాలు ప్రజలకా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పోర్టు కాలుష్యం వల్ల వై.జంక్షన్లో ద్విచక్ర వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కనీసం బొగ్గు లారీలపై తార్పాలిన్లను కూడా వేయకుండా పంపిస్తున్నారని పేర్కొన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలుష్యానికి గురవుతున్న గ్రామాలను గంగవరం పోర్టు యాజమాన్యం దత్తత తీసుకొని ప్రజలు ఆరోగ్యానికి అయ్యే ఖర్చు భరించాలని డిమాండ్ చేశారు. కాలుష్యానికి గురవుతున్న గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపులను యాజమాన్యం నిర్వహించాలని కోరారు. రామచంద్రనగర్ డంపింగ్యార్డుపై శనివారం ధర్నా చేస్తామని, దాన్ని పూర్తిగా తరలించేవరకు రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్.రాజేంద్రప్రసాద్, లోకేష్, డి.రమణ, లక్ష్మి, శ్రీదేవి, సుబ్బారావు, రాజారావు, అర్జునరావు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.