Nov 10,2022 23:22

సోలార్‌ లైట్లు అందుకున్న గిరిజనులతో సిఆర్‌పిఎఫ్‌ అధికారులు

ప్రజాశక్తి -మారేడుమిల్లి : ఏజెన్సీలో విద్యుత్‌ సౌకర్యంలోని మారుమూల గ్రామాల గిరిజనులకు సిఆర్‌పిఎఫ్‌ ఆధ్వర్యంలో సోలార్‌ లైట్లు పంపిణీ చేశారు. గురువారం స్థానిక జెడ్‌పి హైస్కూల్‌లో రాజమండ్రి సిఆర్‌పిఎఫ్‌ కమాండెంట్‌ సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ కమాండెంట్‌ బి రత్నమ్మ, సిఆర్‌పిఎఫ్‌ డిఎస్‌పి గీతమ్మ, సీలేరు అసిస్టెంట్‌ కమాండెంట్‌ సురేష్‌ ఆధ్వర్యంలో నాలుగు పంచాయతీల్లోని 46 మంది గిరిజనులను గుర్తించి వారికి సోలార్‌ లైట్లు పంపిణీ చేశారు. మారేడుమిల్లి సిఐ అద్దంకి శ్రీనివాస్‌, ఎస్‌ఐలు ఎస్‌ రాము, జ్వాలా సాగర్‌, మారేడుమిల్లి జెడ్‌పిటిసి గొర్లె బాలాజీబాబు, సర్పంచ్‌ కొండా జాకోబ్‌, సున్నంపాడు సర్పంచ్‌ వి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొని, వీటిని గిరిజనులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్‌. డిప్యూటీ కమాండెంట్‌ బి రత్నమ్మ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్‌ సౌకర్యంలేని గ్రామాల్లోని గిరిజనులను గుర్తించి, వారికి సోలార్‌ లైట్లు అందజేస్తున్నామని, గతంలోనూ అనేక గ్రామాల్లోని వారికి సిఆర్‌పిఎఫ్‌ ద్వారా అందజేశామన్నారు. మారేడుమిల్లి సిఐ మాట్లాడుతూ మన్యవాసులకు సిఆర్‌పిఎఫ్‌ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.