Oct 22,2023 00:24

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం విమర్శించారు. నవంబరు 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.పాడేరులో శనివారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర వైపల్యం చెందిందని, కాఫీ రైతుల బకాయిలు, ఉపాధి హామీ, రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక ఇప్పటికీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్నన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రచారం తప్ప గిరిజనులకు వైద్యం అందలేదన్నారు. గిరిజన అభివృద్ధి కుంటుపడిందని దుయ్య బట్టారు. రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన బీజేపీకి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వంత పాడటం మానేసి రాష్ట్రం హక్కుల కోసం బీజేపీని నిలదీయాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరగబడతారని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ప్రజలు ఒడిస్తారని అన్నారు. అక్టోబరు 30న గిరిజన ప్రాంతాలను కలుపుతూ బయలుదేరే జాతా సీతంపేటలో ప్రారంభమవుతుందని తెలిపారు. అదే రోజున కర్నూలు జిల్లా ఆదోనిలో మరోజాతా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు తదితర వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నవంబరు 2న ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ 3వ జాతా శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రారంభమవుతుందని వివరించారు. ఈ మూడు జాతాల ముగింపు సందర్భంగా నవంబరు 15న విజయవాడలో బసవపున్నయ్య స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుందని వివరించారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం జరిగే ప్రజా రక్షణ భేరి జాతాలు, బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని కోరారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్శ మాట్లాడుతూ,
పోలీసు శాఖలో 36.53 కోట్ల అవినీతి అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య అనుబంధాన్ని బహిర్గతం చేస్తోందని, ఈ అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ చలానాల పేరుతో ఆటో డ్క్రెవర్లు, వాహన వినియోగదార్ల ముక్కుపిండి, వేదింపులకు గురిచేసి వసూలు చేసిన మొత్తం అవినీతిపాలు కావడం గర్హనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చలానా వేదింపులు ఆపాలన్నారు.గత ప్రభుత్వ హయాంలోనే గరిష్టంగా 2 కోట్లు విలువైన టెండరును ఒక్క రూపాయికే ఆ కంపెనీ టెండరు దాఖలు చేయడం, దానిని పోలీసు శాఖ నమ్మడం, వైసిపి ప్రభుత్వం ఆ కాంట్రాక్టుకు కొనసాగించడం విస్మయపరుస్తోందన్నారు. 2018 నుండి ఇప్పటి వరకు చలానాల ద్వారా వసూలైన సొమ్ము వేరే ఖాతాల్లోకి మళ్ళినా గుర్తించలేక పోవడం, ఆడిట్‌ నిర్వహణ లోపం ఉందని పోలీసు శాఖ ప్రకటించడం, అవినీతి దృష్టికి వచ్చినా వెంటనే స్పందించకపోవడం బాధ్యతారాహిత్య మేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, నాయకులు బోనంగి చిన్నయ్య పడాల్‌, పోతురాజు, సుందర్‌ రావు, లక్కు తదితరులు పాల్గొన్నారు.