Nov 18,2022 23:53

సమావేశంలో పాల్గొన్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే, వెలుగు అధికారులు

ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి -రంపచోడవరం

ఏజెన్సీలోని గిరిజన రైతులు అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు చెందిన వెలుగు ఏపీఎంలు, డిపిఎంలు, ఎపీడీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులకు ఉపాధి కల్పించే విధంగా కోళ్లు పెంపకం, మిల్క్‌ డెయిరీ, జీడిపప్పు ప్రాసెసింగ్‌ యూనిట్లు, చేపల పెంపకం తదితర వ్యవసాయ ఉత్పత్తులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 300 మంది గిరిజన రైతులకు రూ.40 లక్షల వరకు రుణాలు మంజూరు చేయవచ్చన్నారు. ఈ రుణాలు తీసుకున్న రైతులు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేసే విధంగా గ్రామాల్లో సభ్యులను ఎంపిక చేయాలని సూచించారు. అడవి ఉత్పత్తులకు కోల్డ్‌ స్టోరేజీ వాహనం ఏర్పాటు చేసుకుని విధంగా ఒక యూనిట్‌గా ఏర్పడిన సభ్యులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు, డిపిఎం అపర్ణ, యాంకర్‌ పర్సన్‌ రామరాజు, ఎపీఎలు శ్యాం కుమార్‌, మధు, అప్పారావు, ఆదినారాయణ, నీలవేణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.