ప్రజాశక్తి -మధురవాడ :తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో గీతం వేదికగా నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల సౌత్ ఇండియా వీల్ఛైర్ క్రికెట్ కప్ పోటీలను గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ శుక్రవారం ప్రారంభించారు. ఈనెల 13వరకు జరగనున్న పోటీల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 120 మందికి పైగా వికలాంగ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ క్రీడా విభాగం కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ మాట్లాడుతూ విభిన్నప్రతిభావంతుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడానికి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఈ తరహా పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమంలో జివిఎంసి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, విజ్జాన్ కళాశాల రెక్టార్ వి.మధుసూధనరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అరుంధతి, సురక్షా ఆసుపత్రి మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ బి.రావు, ఆంధ్రప్రదేశ్ వీల్ఛైర్ అండ్ డిజెబిలిటీ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు రుక్మాకరరావు, కార్యదర్శి రామన్ సుబ్బారావు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.










