Mar 14,2023 23:06

రక్తదానం చేస్తున్న గీతం బిజినెస్‌ స్యూల్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యాన మెగా రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. గీతం బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ ప్రొఫెసర్‌ అమిత్‌భద్ర, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హజరై స్వచ్చంద రక్తదానం చేసిన విద్యార్ధులను అభినందించారు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యపడుతుందన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న గీతం ఎక్సలెన్స్‌ మీట్‌ (జెమ్‌-2023) యువజనోత్సవంలో భాగంగా చేపడుతున్న ముందస్తు కార్యక్రమాలను సామాజిక సేవతో ముడిపెట్టడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన రక్తదాన శిబిరానికి జెమ్‌-2023 సిఇఒ డాక్టర్‌ షంషుధ్దీన్‌ షేక్‌ సంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ వరప్రసాద్‌, ప్రొఫెసర్‌ మంజశ్రీనాయుడు, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొని రక్తదానం చేశారు. ఎన్‌టిఆర్‌ రక్త నిధి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.