Mar 13,2023 23:25

గీతం అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో నూతనంగా బోధన వృత్తిని స్వీకరించిన అధ్యాపకులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గీతం అకడమిక్‌ ప్రొవైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వారియర్‌ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం నూతన అధ్యాపకులకు ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నూతన విద్యా విధానంలో చోటు చేసుకున్న మార్పులు, ఐటి రంగంతో ముడిపడిన బోధన విధానాలు అధ్యాపకులు అర్థంచేసుకుని కాలానుగుణంగా బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గీతం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ మాట్లాడుతూ ఏటా 300 మంది అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయంగా గీతంను తీర్చిదిద్దడానికి ఈ తరహ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. గీతం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జివిఆర్‌.శర్మ మాట్లాడుతూ బోధన, పరిశోధనలలో అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో గీతం క్యాంపస్‌ లైఫ్‌ ప్రొవైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమరావు, గీతం హైదరాబాద్‌, బెంగళూరులకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.