
ప్రజాశక్తి-మధురవాడ : గీత కార్మిక కుటుంబాలకు అన్యాయం చేయొద్దని, సిఐడి అధికారుల వేధింపులు ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్చేశారు. గీత కార్మికులకు అండగా సిపిఐ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ, మధురవాడ గ్రామ సర్వే నెంబర్ 274/1లో 40 సెంట్లు జిరాయితీ భూమిని పాత మధురవాడకు చెందిన పేద గీత కార్మికుల కుటుంబానికి చెందిన టేక్పూడి పెద్దఅప్పన్న, పీస పైడితల్లి తదితరులు అప్పటి మధురవాడ గ్రామ పెద్దలైన పోతిన సత్యనారాయణ మూర్తి, పిల్ల సత్యనారాయణ మూర్తి సమక్షంలో 1957 జులై 17వ తేదీన దస్తావేజు నెంబర్ 2020 కొనుగోలు చేసుకున్నారని తెలిపారు. 2001లో కుటుంబం అవసరాలు కోసం ఇందులో 20 సెంట్లు భూమిని ఐదుగురు వ్యక్తులకు విక్రయించారని చెప్పారు. ఈ ఐదుగురు ఆ స్థలాల్లో ఉడా, జీవీఎంసీ అనుమతులతో ఇళ్లు కట్టుకొని జీవస్తున్నారని తెలిపారు. మిగిలిన 20 సెంట్లు స్థలంలో గీత కార్మికులు పాకలు, షెడ్లు నిర్మించుకొని ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం పోతిన రమణ దస్తావేజు నెంబర్ 3589 దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని కె.శివరామరాజు అనే వ్యక్తికి అమ్మారని, ఇది ఇది తెలిసిన రైతులు న్యాయస్థానంలోను, సిట్ లోను ఫిర్యాదు చేశారని చెప్పారు. న్యాయస్థానం, సిట్ విచారణ చేసి ఈ భూమి రైతులకు చెందినదని తీర్పు ఇచ్చినట్లు వివరించారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు సిఐడి అధికారులతో బెదిరింపులకు పాల్పడుతూ ఏదోలా సెటిల్ చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారని తెలిపారు. సిఐడి అధికారులు అధికారపార్టీ నాయకులకు కొమ్ముకాయడం దుర్మార్గం అన్నారు. ఈ ఘటనలో సిఐడి అధికారులపై విశాఖ డిసిపికి శనివారం ఫిర్యాదు చేశారని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ అండగా ఉంటుందని పైడిరాజు తెలిపారు. ఈ నిరసనలో రైతులు కుటుంబాలతో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్కె.రెహమాన్, ఎమ్డి.బేగం, వి.సత్యనారాయణ, కె.మేఘారావు, కె.కుమార్, మూగి సూర్యనారాయణ, నారాయణరావు, టి.సత్యనారాయణ, వి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.