- కలెక్టర్ కృతికా శుక్లా
ప్రజాశక్తి - కాకినాడ
ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భవన నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. మంజూరు చేసిన ప్రతి భవన నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని, నిర్మాణ పనులకు వాతావరణం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవనాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పి సిఇఒ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పీడీ ఎం.వెంకటలక్ష్మి, డిపిఒ ఆర్.విక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, మైన్స్ డీడీ మైన్స్ ఇ.నరసింహారెడ్డి, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.శ్రీనివాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కృతికా శుక్లా










