* మంత్రి డాక్టర్ అప్పలరాజు
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: గౌతు కుటుంబం 60 ఏళ్ల పాలనలో ఉద్దానం ప్రాంతానికి ఒక్క శాశ్వత ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం అక్కుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ఈ నాలుగేళ్ల కాలంలో ప్రగతిని చేసి చూపించామని అన్నారు. . కిడ్నీ బాధితుల కోసం ఇచ్చిన హామీ మేరకు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సిఎం చేతుల మీదుగా ఈ నెలలోనే ప్రారంభిస్తారని ప్రకటించారు. నువ్వలరేవు-మంచినీళ్లపేట వద్ద జెట్టి స్థానంలో ఫిషింగ్ హార్బర్ డిజైన్ మార్చడం జరిగిందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర మంత్రిని పట్టుకొని పశువుల మంత్రి అంటూ హేళనగా మాట్లాడడం మీ రందరూ చూస్తున్నారని అన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న గౌతు శిరీష అని పిలవబడే యార్లగడ్డ శిరీషకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, ఎంపీపీ ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్, వైసీపీ అధ్యక్షుడు పి. గురయ్యనాయుడు, కోఅప్సన్ మరడ భాస్కరరెడ్డి,సచివాలయ కోఆర్డినేటర్ వడ్డి కరుణాకర్, ఉప సర్పంచ్ కోడ సోమేశ్వరరావు, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు గైర్హాజరు కావడం వైసిపిలోని లుకలుకలు బయట పడినట్టయిందని గుసగుసలు వినిపించాయి.










