ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ఏయూ అభివృద్ది చేస్తున్న కెవి.గోపాలస్వామి ఆరుబయట రంగస్థలాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించి, తీర్చిదిద్దుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కళలకు, నాటక రంగానికి పెద్దపీట వేసే విధంగా విసి ప్రసాదరెడ్డి పనిచేస్తున్నారని నారాయణమూర్తి ప్రశంసించారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ పేరును సార్ధకత తీసుకువచ్చే విధంగా అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ పాల్గొన్నారు.










