Aug 05,2021 15:39

హైదరాబాద్‌ : ఉద్యమకారులను వదిలేసి ఉద్యమ ద్రోహులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ అందలం ఎక్కిస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన గురువారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపైకి రాళ్లు విసిరిన కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీ చేశారన్నారు. దీనిపై తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులంతా ఓసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల కోసమే సిఎం హామీల వర్షం గుప్పిస్తున్నారని విమర్శించారు. దళితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడాన్ని తానూ స్వాగతిస్తున్నానని, అయితే రాష్ట్రంలో అందరికీ దానిని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సిఎం కెసిఆర్‌కు హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధే ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే లోపే డబ్బును ఇవ్వాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలనూ ఆదుకోవాలన్నారు. గతంలో తనను ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ నేతలే ప్రయత్నించారని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా తనను ఓడించేందుకు ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారని, నేతలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపిచారు. డ్రామాలు ఆడుతున్నారంటూ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను నాటకాలు ఆడేవాడిని కాదన్నారు. వైద్యులు తనకు మెరుగైన చికిత్స చేశారని, వారి సూచన మేరకు మరో రెండు మూడు రోజుల్లో ప్రజాదీవెన పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని స్పష్టం చేశారు.