
ప్రజాశక్తి-ఉక్కునగరం : రాష్ట్రంలో 2013లో అమల్లోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి మార్చి 2023 నాటికి ముగుస్తుందని, దీనిని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించి చట్టం చేయాలని కెవిపిఎస్, ఎపిజిఎస్, స్టీల్ డివిజన్ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ సంఘాలను కలుపుకొని కెవిపిఎస్ చేసిన పోరాట ఫలితంగా జనాభా ప్రాతిపదికగా సబ్ప్లాన్ చట్టం వచ్చిందని తెలిపారు. ప్రణాళిక బడ్జెట్లో నిధులు కేటాయించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల నివాస ప్రాంతాలలో కొంతమేరకు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికి ఖర్చు చేయాలని స్పష్టంగా ఉన్నా పాలకుల్లో చిత్తశుద్ధి లేక దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. టి చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బోండా తౌడన్న, జనరల్ సెక్రెటరీ మల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్వి.రమణ, జాయింట్ సెక్రెటరీ ఆర్.నరసింహ, డిహెచ్పిఎస్ నాయకులు రాజబాబు, సిఎఫ్టియుఐ జనరల్ సెక్రెటరీ డి.సురేష్బాబు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు కోటేశ్వరరావు, పుల్లారావు, అవతారం, వరకుమార్, వైటి.దాస్, శ్రీనివాసులు సువర్ణరాజు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.