ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్ప్లాంట్లో ఈ నెల 20వ తేదీన జరిగే ఎస్సీ, ఎస్టీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో డెమక్రటిక్ ప్యానెల్, యునైటెడ్ ప్యానెళ్లు నామినేషన్లు దాఖలు చేశాయి. ఎన్నికల అధికారి టౌన్ అడ్మిన్(డిజిఎం) బాబూ నాయక్ నామినేషన్లను స్వీకరించారు. ఒక్కో ప్యానెల్ నుంచి 15 మంది చొప్పున వివిధ పదవులకు పోటీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఎన్నికల్లో డెమక్రటిక్ ప్యానెల్కు ఒటు వేసి గెలిపించాలని ఆ ప్యానెల్ అభ్యర్థులు కోరారు. కార్మిక హక్కుల పరిరక్షణకు, రిజర్వేషన్ల అమలు, స్టీల్ప్లాంట్ పరిరక్షణ, వివిధ విభాగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. డెమక్రటిక్ ప్యానెల్ అధ్యక్షునిగా బొండా తౌడన్న, జనరల్ సెక్రటరీగా బయ్యే మల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్వి.రమణారావు, ట్రెజరర్గా కెవి.రత్నం నామినేషన్లను దాఖలు చేశారు. బూలా జగ్జీవన్రామ్, వైటి.దాస్, బి.లాలు, టి.చిరంజీవి, మదిరి రాంబాబు, బిఎంకె.నాయక్, రవింద్ర, సురేష్బాబు, కారు రమణ, రామన్న ఈ ప్యానల్ కూర్పులో కోర్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.










