
పీలేరు : ఎస్సి వర్గీకరణ సాధించడమే లక్ష్యమని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర అన్నారు. మందకృష్ణ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు చేపడుదామని తెలిపారు. బుధవారం పీలేరులో జిల్లా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కెఎన్.రాజుతో కలిసి రవీంద్ర మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ నాయకత్వంలో 29 ఏళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తు న్నామని, మాదిగ, దాని ఉప కులాలకు న్యాయం జరగాలంటే ఎబిసిడి వర్గీకరణ అత్యంత కీలకమని, అది సాధించే దిశలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతో తాడోపేడో తేల్చుకోవడానికి చివరి యుద్దంగా మహా జననేత మందకృష్ణ మాదిగ అలంపూర్ నుండి హైదరాబాదుకు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి శ్రేణులు అనుబంధ సంఘాల నాయకత్వాన్ని కూడగట్టుకుని ప్రతి గ్రామానికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి మాదిగ యువతను చైతన్య పరిచి బలమైన నిర్మాణం చేపడుతూ చలో హైదరాబాద్కు సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. అనంతరం మందకృష్ణ నిర్వహిస్తున్న మహా పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్, ఎంపిఎస్ నాయకులు వంగళ్ల శ్రీనివాసులు, గండికోట వెంకటేష్, అమరాల వెంకటరమణ, ముల్లంగి రెడ్డప్ప, చరణ్ కుమార్, వెంకటరమణ, గండికోట హుస్సేనయ్య, నాగేశ్వరరావు, బేతపూరి సురేష్, వెంకటరమణ, నాగరాజ, శ్రీరాములు, కొండయ్య నిర్మల, రెడ్డమ్మ కనకమ్మ, మంగమ్మ, యువ నాయకులు రాజేష్, ప్రణీత్, మోహన, దామోదర, దయాకర, రమేష్ పాల్గొన్నారు.