Jul 18,2022 00:25

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న పెంటారావు

ప్రజాశక్తి -గాజువాక : ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉత్తరాంధ్ర దళిత, ఆదివాసుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ పి.పెంటారావు డిమాండ్‌ చేశారు. గాజువాకలో ఆదివారం ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించకుండా ఆ వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరారు. ఎస్‌సి కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కులాలుగా విభజించి బడ్జెట్‌ను కేటాయించకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పేదల గృహ నిర్మాణాల కోసం, గత ప్రభుత్వాలు ఎస్‌సి, ఎస్‌టిలకు భూమిపై హక్కు కల్పిస్తూ డి ఫారం పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ అసోసియేషన్‌ అధ్యక్షులు నెక్కల నాగమణి, కన్వీనర్‌ పతివాడ రాంబాబు, అప్పారావు, కరజాడ కృష్ణ పాల్గొన్నారు.