న్యూఢిల్లీ : దేశంలో ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 2018తో పోలిస్తే 2019లో ఈ కేసులు 11.46 శాతం పెరిగినట్టు వివరించింది. కాగా, 2017తో పోలిస్తే 2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 11.15 శాతం తగ్గడం గమనార్హం. ఈ మేరకు సామాజిక న్యాయ, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారాన్ని ఆయన పొందుపరిచారు. దీని ప్రకారం.. 2019లో మొత్తం 49,608 కేసులు రిజిస్టర్ కాగా, 2018లో 44,505 కేసులు నమోదయ్యాయి. 2017లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సంఖ్య 50,094కు పెరగడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, 1989, దాని నిబంధనలు పటిష్టంగా అమలు చేసేలా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు పంపించినట్టు కేంద్ర మంత్రి వివరించారు.