లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి మద్దతు తెలిపేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సాయంత్రం యుపికి వెళ్లనున్నారు. ఈ నెల 10న తొలి దశ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆమె యుపిలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం యుపికి చేరుకోనున్న ఆమె.. మంగళవారం ఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనున్నారు. ఎస్పికి మద్దతునివ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, ఈ యుపి ఎన్నికల్ల తాము అభ్యర్థులను బరిలోకి దింపమని మమతా ప్రకటించినప్పటికీ... 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీకి దింపుతామని పేర్కొన్న సంగతి విదితమే. 'యుపి అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదు. కానీ ఎస్పికి మద్దతు ఇస్తున్నాం. 2024 లోక్ సభ ఎన్నికల్లో టిఎంసి బరిలోకి దిగుతాం' అని పేర్కొన్నారు.










