Jan 16,2022 18:20

లక్నో : బిజెపికి, మంత్రి పదవీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో ఒకరైన ధారాసింగ్‌ చౌహన్‌ ఊహించినట్లుగానే అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో ఆదివారం చేరారు. కాగా, ఇటీవల బిజెపిని వీడి, ఎస్‌పిలోకి చేరిన మూడవ మంత్రి చౌహాన్‌ కావడం గమనార్హం. ' 2017లో బిజెపి ప్రభుత్వం 'సబ్‌ కా సాత్‌, సబ్‌కా వికాస్‌' అనే నినాదాన్నిచ్చింది. పార్టీ అందరి నుండి మద్దతు తీసుకుంది కానీ, అభివృద్ధి ఫలాలు కొందరికే దక్కాయి' అంటూ ధారా సింగ్‌ వ్యాఖ్యానించారు. యుపిలో రాజకీయాలను మార్చి.. అఖిలేష్‌ యాదవ్‌ మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. ఒబిసి, దళితులు ఏకతాటిపైకి వస్తారని, మార్పు అనివార్యమని పేర్కొన్నారు. బిజెపి మిత్ర పక్షమైన అప్నా దళ్‌ ఎమ్మెల్యే ఆర్‌కె వర్మ కూడా.. ఎస్‌పిలో చేరారు. ధారా సింగ్‌, వర్మను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్న అఖిలేష్‌.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంపై (కేంద్రం, యుపిలోని బిజెపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి)పోటీ చేస్తున్నామని అన్నారు. వారు బ్రేకింగ్‌ రాజకీయాలు చేస్తారని, కానీ తాము అభివృద్ధి రాజకీయాలు చేస్తామని.. బిజెపి నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.