Oct 20,2023 22:48

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం పాత పెన్షన్‌ సాధించేవరకూ పోరాటం ఆగదని, సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేయాలని వక్తలు ఉద్ఘాటించారు. ఒపిఎస్‌ పునరుద్ధరణ కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. చిత్తూరులో నిరవధిక దీక్షను పోలీసులు భగం చేసి నేతలను స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఎంత నిర్బంధం కొనసాగించానా ఒపిఎస్‌ సాధించేవరకూ పోరాడతామని జిల్లావ్యాప్తంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. చిత్తూరు అర్బన్‌ : సిపిఎస్‌ మాకొద్దు.. ఒపిఎస్‌ కావాలి' అంటూ చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం చేపట్టిన నిరవధిక దీక్షను శుక్రవారం పోలీసులు భగం చేశారు. యుటిఎఫ్‌ నాయకులు రాత్రుల్లో సైతం దీక్షా శిబిరంలోనే నిరశన కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ విశ్వనాధరెడ్డి ఆధ్వర్యంలో దీక్షా శిబిరం వద్దకు వచ్చి యుటిఎఫ్‌ నాయకులు రఘుపతిరెడ్డి, జీవి రమణ, సుధాకర్‌రెడ్డి, సోమశేఖర్‌నాయుడు, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రెడ్డప్పనాయుడు, దక్షిణామూర్తి, ఎంవి రమణ, పార్థసారథినాయుడులకు బలవంతంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. నాయకులను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ తీరుపై యుటిఎఫ్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆస్పత్రిలో నాయకులను పరీక్షించిన వైద్యులు నేతలకు బీపీ, సుగర్‌ లెవల్స్‌ తగ్గాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్‌ భరోసా కోసం యుటిఎఫ్‌ చేసిన నిరవధిక దీక్షలకు ఎపిటిఎఫ్‌ 1930 జిల్లా నాయకత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శాంతి యుతంగా హక్కుల సాధనకోసం అమరణ నిరాహార దీక్షలకు పూనుకున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా దీక్షలను భగ్గ్నం చేయడం దుర్మార్గమని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రఘుపతి రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్‌నాయుడు, జివి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఫోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి టౌన్‌లో... యుటిఎఫ్‌ కార్యాలయంలో పాత పెన్షన్‌ సాధనకై గురువారం ప్రారంభమైన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ముత్యాలరెడ్డి. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.నిర్మల, జిల్లా కార్యదర్శి దండు రామచంద్రయ్య, సిపిఎస్‌ సబ్‌కమిటీ జిల్లా కో కన్వీనర్‌ ఆర్‌.నాగరాజు పాల్గొన్నారు. గూడూరులో.. పాత బస్టాండ్‌ సమీపంలో విశ్రాంత ఉద్యోగుల భవనం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ వాసుదేవరావు, జిల్లా కార్యదర్శి సుధీర్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనకు సిపిఎం నాయకులు జోగి శివకుమార్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి సురేష్‌, ఎల్‌ఐసి అసోసియేషన్‌ నాయకులు విజరుకుమార్‌, శివకుమార్‌ సంఘీభావం ప్రకటించారు. యుటిఎఫ్‌ నాయకులు రవి, మురళీసింగ్‌, శివకళ, నాగేశ్వరరావు, పానేష్‌, గురునాధం పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో... సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ యుటిఎఫ్‌ మండల శాఖల ఆధ్వర్యంలో సూళ్లూరుపేట సిఐటియు ఆఫీసులో నిరవధిక దీక్ష చేపట్టారు. పూర్వపు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చెంగని చంద్రశేఖర్‌, తిరుపతి జిల్లా అధ్యక్షులు జిజె రాజశేఖర్‌ ప్రారంభించారు. ఈ దీక్షల్లో కావూరు ప్రభాకర్‌, ఎస్‌.బాబు, కొప్పోలు అరుణకుమారి, ఎ.గోవర్ధన్‌, ఎన్‌.రవికుమార్‌ పాల్గొన్నారు. వెంకటగిరిలో... వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల యుటిఎఫ్‌ కార్యకర్తలు నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. ఎవరైతే ఒపిఎస్‌ అమలు చేస్తారో వారికే తమ ఓటని నేతలు హెచ్చరించారు. దీక్షల్లో జిల్లా కార్యదర్శి ఎం.కుమారస్వామి, రాష్ట్ర కౌన్సిలర్‌ కె.ఉదరుకుమార్‌ పాల్గొన్నారు. సిఐటియు నాయకులు వడ్డిపల్లి చెంగయ్య సంఘీభావం ప్రకటించారు. నాయుడుపేటలో... సిఐటియు కార్యాలయంలో దీక్ష చేపట్టారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ఎం.రామ్మూర్తిరాజు, మాజీ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. సిఐటియు నాయకులు ముకుంద, వెంకటేశ్వర్లు సంఘీభావం ప్రకటించారు. నగరిలో... జరిగిన దీక్షలోమెన్‌.మణిగండన్‌, కె.కుప్పరాజు, కె.వంశీకృష్ణ, మాసిలామణి, యువరాజు, హరిదాసు, ఆనందయ్య, షన్ముగం పాల్గొన్నారు. పలమనేరులో... యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ప్రకాష్‌, జిల్లా నాయకులు ప్రసన్నకుమార్‌, కృష్ణమూర్తి, బాబు, దయానంద, గురుమూర్తి పాల్గొన్నారు. ఆప్టా సంఘ నాయకులు మునాఫ్‌, ప్రభుత్వ పెన్షనర్‌ సంఘ నాయకులు రత్నారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఓబుల్‌రాజు, గిరిధర్‌గుప్తా సంఘీభావం తెలిపారు.