ప్రజాశక్తి -అరకులోయ రూరల్:సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ అరకులోయ ప్రభుత్వ జూనియర్ కాలేజి వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కె.సిమోన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల హాస్టల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నామమాత్రంగా మెస్ ఛార్జీలు పెంచారరన్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నూతన మెనుకి పెంచిన ఛార్జీలు ఏ మాత్రం సరిపోలేదన్నారు. ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచి గిరిజన సంక్షేమ హాస్టల్స్లో చదువుతున్న విదార్థులకు పౌష్టికాహారం అందించేందుకు విధంగా చూడాలన్నారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరకువేలి ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు కె.రవి, ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు .










