
ప్రజాశక్తి -ములగాడ : ఎస్బిసి బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించాలని కోరుతూ జివిఎంసి 63వ వార్డు పరిధి కాకరలోవలో పాదయాత్రను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, మేయర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని నావికదళ అధికారులతో చర్చించి డాక్యార్డు బ్రిడ్జి పైనుంచి వాహనాల రాకపోకలకు అనుమతించేలా చూడాలని కోరారు.
1968 నుంచి సర్దార్ వల్లభారు పటేల్ డాక్ యార్డ్ చిన్న బ్రిడ్జి పై నుంచి నిత్యమూ వేల వాహనాల ద్వారా లక్షలాదిమంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. బ్రిడ్జి శిథిలావస్తకు చేరుకోవడంతో 15 నెలల పాటు మూసివేస్తామని విశాఖ పోర్టు నిర్ణయించిందని తెలిపారు. బ్రిడ్జి బాగుచేయడం మంచిదేనని, కానీ అంతవరకు పక్కనే ఉన్న ఎస్బిసి వంతెనపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించాలని తూర్పు నావికాదళ అధికారులకు విజ్ఞప్తిచేశారు. జివిఎంసి పరిధిలో గల 40, 58 నుంచి 63, 64 వార్డుల్లో సుమారు రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, వీరు ఎమర్జెన్సీ వైద్యానికి నగరంలోని కెజిహెచ్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు డాక్ యార్డు బ్రిడ్జి పైనుంచే వెళ్తున్నారని తెలిపారు. ఇప్పుడు బస్సు వెళుతున్న మార్గం గుండా ప్రయాణించాలంటే ప్రాణాలకు రక్షణ ఉండదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. డాక్ యార్డు గొడౌన్స్, మారుతి జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ చేరుకోవడానికి సుమారు ఆరు కిలోమీటర్లు పెరుగుతుందని, ఈమార్గంలో మూడు రైల్వే ట్రాకులు, వందలాది భారీ వాహనాలు రాత్రీ పగలు ప్రయాణిస్తాయని తెలిపారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదు కనుక రక్షణ రంగం అవసరంకోసం నిర్మించుకున్న బ్రిడ్జిపై వాహనాలకు అనుమతులు వచ్చే విదంగా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కృషిచేయాలని కోరారు. ఈ పాదయాత్రలో సిపిఎం జోన్ నాయకులు కె.పెంటారావు, ఎన్.శ్రీనివాసరావు, పివి.భాస్కరరావు, పి.సురేష్ డి.గోపాల్, ఆదినారాయణ పాల్గొన్నారు. 59వ వార్డు నెహ్రునగర్ లేబర్ జంక్షన్ నుంచి చేపట్టిన పాదయాత్రలో ఆర్.లక్ష్మణమూర్తి, వై.గంగాధర్ బి.శ్రీను, డి.రాజేష్, సుభానీ, రాజు, పైడినాయుడు, 62వ వార్డు త్రినాధపురం పాదయాత్రలో సిపిఎం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు, నాయుకులు పి.రామారావు, ఎల్.కృష్ణ బి.జగ్గునాయుడు, బి.అర్జునరావు పాల్గొన్నారు.