
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, డాక్యార్డు మీదుగా కాన్వెంట్ జంక్షన్కు వెళ్ళే మార్గంలో గల డాక్యార్డు చిన్నబ్రిడ్జిని మరమ్మత్తులు కోసం 15నెలలు మూసివేస్తున్నట్లు విశాఖ పోర్టు ట్రస్టు ప్రకటించిందని, అంతవరకు ఆ పక్కనే ఉన్న ఎస్బిసి బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్చేశారు. మద్దిలపాలెంలోని సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డాక్యార్డు, షిప్యార్డు, హెచ్పిసిఎల్, ఐఒసి, కోరమండల్, ఎపిసిఎల్, ఎస్సార్, ఆర్సిఎల్ పరిశ్రమలతో పాటు పోర్టు ఆధారిత గొడౌన్లల్లో వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వంతెనను మూసివేయడంతో షిప్ట్ డ్యూటీలు చేసే కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని పేర్కొన్నారు. పై చెప్పిన పరిశ్రమల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా డాక్యార్డు ఈ వంతెన మీదుగానే నగరంలో ప్రధాన ఆసుపత్రులకు తరలిస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2లక్షల మంది ప్రజలు ఎమర్జన్సీ వైద్యానికి నగరంలోని ఆసుపత్రులే పెద్దదిక్కుగా ఉన్నాయన్నారు. ప్రత్యామ్నా యంగా ఉన్న రహదారిలో రైల్వే క్రాసింగ్లు, రైల్వే వ్యాగన్లతో తరచూ పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతున్న స్థితిలో ఎస్బిసి బ్రిడ్జిపై ప్రజా వాహనాలు అనుమతించకపోతే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశముందని తెలిపారు. పజల ప్రాణాల రక్షణ, కోట్లాది రూపాయలు ఇంధనం, ప్రజలు, కార్మికుల సమయం, అదనపు భారాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయరు, కార్పొరేటర్లు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం, తూర్పునావికాదళ అధికారులతో సంప్రదింపులు జరపాలని కోరారు. పటేల్ (పార్లర్ బ్రిడ్జి) మరమ్మత్తులు పూర్తయ్యేవరకు ఎస్బిసి బ్రిడ్జి మీదుగా ప్రజల వాహనరాకపోకలు అనుమతించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థల యూనియన్లు, ప్రజాసంఘాలు, ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ సభ్యులు, మద్దిలపాలెం, మల్కాపురం జోన్ కార్యదర్శులు వి.కృష్ణారావు, పి.పైడిరాజు పాల్గొన్నారు.