ఎరువులు ఎక్కువగా వాడొద్దు : ఎడిఎ
ప్రజాశక్తి - వెంకటగిరి
'ఎరువులు ఎక్కువగా వేస్తే ఆదాయం ఎక్కువ వస్తుందనేది పూర్తిగా అపోహ, ఖర్చు ఎక్కువై అన్నదాతకు ఆదాయం తగ్గుతుంది' అని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఎడిఎ మెరుగు భాస్కరయ్య తెలిపారు. ఆత్మ సహకారంతో వెంకటగిరి మండలం పారవోలు గ్రామంలో వరి సాగుపై ఆయన రైతులకు శిక్షణ ఇచ్చారు. వరికి యూరియా ఎక్కువగా వేస్తే చీడ బెడద ఎక్కువవుతుందన్నారు. భూమిలో భాస్వరం నిల్వలుపెరిగితే జింక్ పోషకం పైరుకు అందదని తెలిపారు. దీనివలన రైతుకు ఖర్చు పెరగడం తప్ప లాభం ఏమీ ఉండదని చెప్పారు. వరికి దుక్కిలో, చిరు పొట్ట దశలో 20 కిలోల చొప్పున పొటాష్ వేస్తే చీడల సమస్య తగ్గి, ధాన్యం నాణ్యంగా ఉంటుందని చెప్పారు. ఎఒ వేణుగోపాలరావు రబీ కాలంలో సాగుకు అనువైన వరి రకాలు, నారు పెంపకంలో మెళకువలు, కలుపు నిఆరణ గురించి వివరించారు. రబీలో పంటల సాగుకు అవసరమైన ఎరువులను ఆర్బికెల్లో అందుబాటులో ఉంచుతామని, వీటిని రైతులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుజాత కోరారు. గ్రామ వ్యవసాయ సహాయకులు శివ పాల్గొన్నారు.
అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ...










