ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
దుంగలు, కారు స్వాధీనం
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో ఆరు ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు అధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన మురళీధర్ రెడ్డి టీమ్ సోమవారం పొద్దుటూరు, ఖాజీపేట సెక్షన్ లో కూంబింగ్ చేపట్టారని పత్తూరు ఫారెస్ట్ బీటు పరిధిలో పత్తూరు సమాధులు దగ్గర కొంతమంది వ్యక్తులు కారులోకి ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారన్నారు. వారిని చుట్టుముట్టి అక్కడ ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లర్లను తమిళనాడు తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన శక్తివేల్ చిన్నస్వామి(33), రాజేంద్రన్(28), జమునామత్తూరు తాలూకాలోని భాస్కర్ (22), అజిత్ కుమార్ (25), ప్రవీణ్ కుమార్ (23), వేల్లియన్ (41), ఆనైకట్టు తాలూకా లోని రాజామణి ముత్తు(36), శేఖర్ చిన్నస్వామి (24)లుగా గుర్తించామన్నారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చామన్నారు. వీరిని రిమాండుకు తరలించామని ఎస్ఐ రఫీ తెలిపారు.










