Sep 28,2023 22:15

ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దుచేయాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్‌
ప్రజాశక్తి- పూతలపట్టు :
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేయకుండా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం సరైనది కాదని వారికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి షకీలాలు డిమాండ్‌ చేశారు. పూతలపట్టు మండల కేంద్రంలో అంగన్వాడీల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ వలన అనేక రకాల సమస్యలు ఉన్నాయని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్‌ పనిచేయడం లేదని తెలిపారు. 5జి సిమ్‌ ఉంటేనే పనిచేస్తున్నాయని మరి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వాటికి సరిపడా ఫోన్లో కూడా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పని ఒత్తిడి వలన మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటే ఉక్కు పాదంతో అణచివేయడం ఏమిటి అని ప్రశ్నించారు. ఉద్యమాలను ఎంత అణచినా రెట్టింపు స్థాయిలో జరుగుతాయని గత అనేక అనుభవాలు అంగన్వాడీ ఉద్యమంలో ఉన్నాయని ప్రభుత్వం గ్రహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోరాటాలు చేసి సాధించుకున్న హెల్పర్ల ప్రమోషన్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రాటివిటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పూతలపట్టు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారిగా వనజ, నీరజ, హేమలతలతో పాటు తొమ్మిది మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.