Jul 29,2021 18:40

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన 28 ఏకలవ్య స్కూళ్ళలో 11 విశాఖపట్నం జిల్లాలోనూ, 6 తూర్పు గోదావరి జిల్లాలోనూ ఉన్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఏకలవ్య సూళ్ళలో నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకుని సహకరించడానికి వీలుగా 2019లో గిరిజన విద్యార్ధుల జాతీయ విద్యా సంఘాన్ని (ఎన్‌ఈఎస్‌టిఎస్‌)ను నెలకొల్పడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సంస్థను నెలకొల్పిన తొలి ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య స్కూళ్ళలో 92 శాతం మంది పదో తరగతి విద్యార్ధులు, 88 శాతం మంది ఇంటర్‌ విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్ధుల్లో 13 మంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లోనూ, 11 మంది మెడికల్‌ కోర్సుల్లోనూ 21 మంది ఇతర ప్రొఫెనల్‌ కోర్సుల్లోనూ ప్రవేశాలు పొందారని తెలిపారు.