ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జర్మనీ దేశస్తులు శుక్రవారం పర్యటించారు. ఏఓబి సరిహద్దులోని మల్కన్గిరి జిల్లా కుడుముల గుమ్మ బ్లాక్ పరిధి గిరిజన గ్రామాల్లో జర్మనీ దేశానికి చెందిన మార్క్ శాన్స్ గ్రాఫ్, ఆయన సతీమణి జూటగ్రాఫ్ సందర్శించి గిరిజన ఆచార సంప్రదాయాలను తిలకించారు. ఆదివాసీల స్థితిగతులపై ఆరా తీశారు. గ్రాఫ్ దంపతులు రాక సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయ థింసా నృత్యాలు చేయగా, వారితో కలిసి గ్రాఫ్ దంపతులు స్టెప్లు వేశారు. కుడుముల గుమ్మ బ్లాక్ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, పచ్చటి కొండలు, దట్టమైన అడవులను చూసి మంత్రముగ్ధులయ్యారు. గిరిజనులు వేటకు ఉపయోగించే విల్లంబులు, వెదురుతో తయారు చేసిన ఇతర వస్తువులను తిలకించి ఫిదా అయ్యారు. గిరిజనులు ఏ విధంగా జీవనోపాధి కొనసాగిస్తున్నారు? వారి పిల్లలు విద్యాభ్యాసం ఎలా సాగిస్తున్నారు? వంటి అంశాలపై గిరిజనులకు అడిగి తెలుసుకున్నారు.










