ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. పోలీసు అధికారుల కథనం ప్రకారం... మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు, ప్రత్యేక పోలీసు దళాలు గత రెండు వారాలుగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల బృందం తారసపడింది. పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు (23) మృతి చెందాడు. సుమారు గంటసేపు కాల్పుల శబ్దం వినిపించినట్లు సమీపంలోని గూడెంవాసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టు వద్ద 303 రైఫిల్, వంట సామగ్రి, కొన్ని ఔషధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.