Jul 06,2023 00:10

ధర్నా చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, సిఐటియు నేత గనిశెట్టి

ప్రజాశక్తి - పరవాడ
సింహాద్రి ఎన్టీపీసీలో కాంటాక్ట్‌ కార్మికులకు డెస్ట్‌ అలవెన్స్‌ పెంచుతూ వెంటనే అగ్రిమెంట్‌ చేయాలని కోరుతూ ఎన్టిపిసి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం ఎన్‌టిపిసి సింహాద్రి మెయిన్‌ గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌టిపిసిలో డెస్ట్‌ అలవాన్స్‌ సమస్య సంవత్సరాలు తరబడి పెండింగ్లో పెట్టడం దుర్మార్గమన్నారు. మెడికల్‌ టెస్టు పేరుతో వేధింపులు గురి చేయడం డ్యూటీ నుండి నిలిపివేయడం అన్యాయమన్నారు. కాంటాక్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అగ్రిమెంట్‌ పూర్తి అయిన తేదీ నుండి ఏరియర్స్‌ చెల్లించాలని కోరారు. ఎన్టిపిసి యాజమాన్యం విభజించు, పాలించు, విధానాన్ని అమలు చేస్తుందని అన్ని యూనియన్లతో చర్చలు చేసి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టిపిసి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పి పి నాయుడు, ఉపాధ్యక్షులు పి గోవిందరాజు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు