ప్రజాశక్తి - పరవాడ
ఎన్టీపీసీ సింహాద్రి సీఎస్ఆర్ నిధులు రూ.55.30 లక్షలతో నిర్మించిన మౌలిక సదుపాయాలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, ఎన్టీపీసీ సింహాద్రి గ్రూప్ జనరల్ మేనేజర్ సంజరు కుమార్ సిన్హా గురువారం ప్రారంభించారు. ముత్యాలమ్మపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో రూ.13.80 లక్షలతో డైనింగ్ హాల్, నాయుడుపాలెం పంచాయతీ పరిధి రాములుగారి దొడ్డి, కోరంగివానిపాలెం వద్ద రూ.22లక్షలతో ఓవర్హెడ్ ట్యాంకులు, ఐఇఆర్సి భవిత కేంద్రంలో వికలాంగ పిల్లల కోసం రూ.15 లక్షలతో హాల్, మూడు గదులు ఏర్పాటు చేశారు. రూ.1.50 లక్షలతో పేద పిల్లలకు 11 నెంబర్ వీల్ చైర్లు, 10 వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. నాయుడుపాలెం పంచాయతీ సిమ్మంగారి దూది వద్ద రూ.3లక్షలతో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ, ఎన్టిపిసి పరవాడ మండలానికి వివిధ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువతకు మెయింటినెన్స్ ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని రాబోయే రోజుల్లో ఇదే సహాయాన్ని కొనసాగించాలని కోరారు. ఎన్టిపిసి గ్రూప్ జనరల్ మేనేజర్ సంజరు కుమార్ సిన్హా మాట్లాడుతూ ఎమ్మెల్యే, సర్పంచ్లు గ్రామపెద్దల నుండి దశలవారీగా చేసిన అభ్యర్థనల ఆధారంగా ఎన్టిపిసి కచ్చితంగా సాధ్యమయ్యే పనులు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాస్, ఎంపీడీవో హేమచంద్రరావు ఎంఈఓ సునీత, ఈవోఆర్డి పద్మజ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.










