
జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రూపొందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి మంగళవారం ఎలక్టోరల్ రోల్స్ - స్పెషల్ సమ్మర్ రివిజన్, మరణాలు, నకిలీ ఎంట్రీలు, అక్రమాలు, ఫిర్యాదుల పరిశీలన, రేషలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, ఎపిక్ కార్డ్ జనరేషన్ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, డిఆర్ఒ కె.కృష్ణవేణి, ఇఆర్ఒలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి నివేదికలు అందించినట్లు తెలిపారు. నివేదికలు పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని కోరామన్నారు. ఉండి నియోజకవర్గం తప్ప ఎన్నికలకు సంబంధించి ఈ రోల్స్ అప్డేషన్ అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేశామన్నారు. ఓటర్ల సవరణ అనంతరం ఇఆర్ఒ ద్వారా పూర్తి చేస్తామన్నారు. డిఎస్సి, పిఎస్సి, షిఫ్టింగ్ ఓటర్స్ను సిబ్బందితో పరిశీలిస్తున్నామని తెలిపారు. పున్ణపరిశీలన వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాలో తొలగించిన ప్రతి ఓటునూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో రేషన్లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఈనెల సమావేశం నిర్వహించి, తుది జాబితాను ఎన్నికల కమిషన్కు సమర్పించడం జరుగుతుందని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఒ కె.కృష్ణవేణి, ఆర్డిఒ దాసిరాజు పాల్గొన్నారు.