ప్రజాశక్తి-రాంబిల్లి
రాంబిల్లి మండలం ఎం.చింతువ వద్ద ఏర్పాటు చేసిన ఎన్ఎఓబి నిర్వాసిత కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించి మరింత అభివృద్ధి చేస్తామని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. మంగళవారం ఆమె వివిధ శాఖల జిల్లా అధికారులుతో కలసి కాలనీని సందర్శించారు. గ్రామం మొత్తం తిరిగి పరిశీలించారు. స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, విద్యా, వైద్యం, తదితర రంగాలలో అవసరమైన చర్యలు చేపడతామన్నారు. స్థానికులు చెప్పిన విషయాలపై స్పందిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్డిసి అనిత, ఆర్డీఓ చిన్ని కృష్ణ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హేమంత్, మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు, విద్యాశాఖ, ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల జిల్లా అధికారులు, తహశీల్దారు భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.










