Aug 16,2023 21:43

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్‌
            డాక్టర్‌ సబిత జూనియర్‌ కళాశాలలో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన కడితల ధన్యశ్రీ జెఇఇ పరీక్షల్లో ర్యాంకు సాధించి అగర్త ఎన్‌ఐటిలో సీటు సాధించింది. ఈ సందర్భంగా భీమవరం ఆర్‌డిఒ, పాలకొల్లు మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ దాసిరాజు ధన్యశ్రీని సత్కరించారు. ఉల్లంపర్రు మాంటిస్సోరిస్‌ విద్యాసంస్థ బహుకరించిన రూ.రెండు లక్షల చెక్కును భీమవరం ఆర్‌డిఒ కార్యాలయంలో ధన్యశ్రీకి అందించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ దాసిరాజు మాట్లాడుతూ ఉత్తమ విద్యాబోధన అందించడంతో పాటు ఉన్నత విద్య కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమని, ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సాహిస్తున్న ఉల్లంపర్రు మాంటిస్సోరిస్‌ పలువురికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సబిత కాలేజీ సెక్రటరీ, కరస్పాండంట్‌ మద్దాల వాసు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఉల్లంపర్రు మాంటిస్సోరిస్‌, డాక్టర్‌ సబిత విద్యాసంస్థలు అండగా ఉంటూ సహకారాన్ని అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ వసంతలక్షి, ఐఐటి ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ వేగేశ్న అరుణ, మేనేజర్‌ రావాడ సతీష్‌ పాల్గొన్నారు.