హైదరాబాద్ : మహబూబాబాద్ టిఆర్ఎస్ ఎంపి మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. గత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో ఎంపి కవితపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పు మేరకు ఎంపి కవిత రూ.10 వేల జరిమానాను చెల్లించారు. అనంతరం కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాలోత్ కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కూతురు. తన రాజకీయ జీవితాన్ని ఆమె 2009లో ప్రారంభించారు. 2009లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్లో ఉన్నారు.