ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ, పోలీసు అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించాలన్నారు. పోలింగ్ నిర్వాహణకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ు.పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈనెల 5లోపు ఓటరు స్లిప్స్లు పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎంపిడిఒలను ఆదేశించారు. ఎస్పి వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఆదనపు ఎస్పి మహేష్, జిల్లా రెవెన్యూ అధికారి కె.లక్ష్మీ శివ జ్యోతి, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ అర్జున్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శంకర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి సరోజిని, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర, బాపట్ల డిఎస్పి శ్రీనివాసరావు చీరాల డిఎస్పి శ్రీకాంత్, తహశీల్దారు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.










